కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:36 PM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
- విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
- మహబూబ్నగర్లో భారీ ర్యాలీ, ధర్నా
మహబూబ్నగర్ విద్యావిభాగం, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీచార్జీని నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం మహబూబ్నగర్ పట్టణంలో ధర్నా చేశారు. అంతకుముందు ధర్నా చౌక్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పేపర్ల లీకేజీ కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని సస్పెండ్ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ధర్నా, ర్యాలీలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాము, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సీతారామ్, నాయకులు లక్ష్మణ్, రాజు, నందు, ఈశ్వర్, రాజశేఖర్, శివ, జిశాంత్ మారుతి, మహేశ్, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు డాక్టర్ మధుసూదన్, డాక్టర్ ప్రతిభ, కిల్లెగోపాల్, రాఘవాచారి, ఖలీల్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.