Share News

ప్రజా పోరాటాల శిఖరం తెలుగు ప్రజలకు సుర‘వరం’

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:37 PM

ప్రజా పోరాట యోధుడు.. కమ్యూనిస్టు ఉద్యమ శిఖరం సురవరం సుధాకర్‌రెడ్డి. తండ్రి వెంకటరామి రెడ్డి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన జీవితం.

ప్రజా పోరాటాల శిఖరం  తెలుగు ప్రజలకు సుర‘వరం’

- విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంపై ఆసక్తి

- బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌లు, పుస్తకాల కోసం తొలి ఉద్యమం

- ఏఐఎస్‌ఎఫ్‌లో చేరికతో సీపీఐతో అనుబంధం

- ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా మూడు సార్లు ఎన్నిక

- నేడు ఆయన ప్రథమ వర్థంతి

ప్రజా పోరాట యోధుడు.. కమ్యూనిస్టు ఉద్యమ శిఖరం సురవరం సుధాకర్‌రెడ్డి. తండ్రి వెంకటరామి రెడ్డి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన జీవితం. సీపీఐకి మూడు పర్యాయా లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అగ్రనేత. గతేడాది ఆగస్టు 22న 83 ఏళ్ల వయసులో తుదిశ్వాస వదిలారు. ఆయన జీవితం, ఉద్యమాలు, సాధించిన విజయాలు, పార్టీకి చేసిన సేవలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం. రాజకీయాల్లో సిద్ధాంత నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీ ఆయన సొంతం. విద్యార్థి ఉద్యమాల నుంచి దేశ రాజకీయాల దాకా ఆయన సాగించిన ప్రయాణం ఒక వామపక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం. నేడు ఆయన ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

- అలంపూరుచౌరస్తా (ఆంధ్రజ్యోతి)

సురవరం సుధాకర్‌రెడ్డి 1942, మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తన మాతృ మూర్తి స్వస్థలం కొండ్రావుపల్లిలో జన్మించారు. వారి స్వగ్రామం కంచుపాడులో పాఠశాలలు లేకపోవడం తో పొరుగునే ఉన్న కర్నూలు నగరంలో విద్యాభ్యాసం చేశారు. మునిసిపల్‌ హైస్కూల్‌, కోల్స్‌ మెమోరియల్‌ ఉన్నతపాఠశాలలో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా కాలేజీలో బీఏ పూర్తిచేశారు. 1967లో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సి టీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకు న్నారు. ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాదు తెలంగాణ ప్రాతంలో కమ్యూనిస్టు నేతృత్వంలో జరిగిన రైతు తిరుగుబాటు లో చిన్నతనంలోనే పాల్లొన్నారు.

బాల్యం నుంచే పోరాటతత్వం

సుధాకర్‌రెడ్డి కర్నూలులో చదువుకుంటున్నప్పుడే పోరాటతత్వాన్ని కలిగి ఉన్నారు. తాను చదువుకొనే పాఠశాలలో బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌లు, పుస్తకాల కోసం విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇది జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లోని సమస్యలను తెరపైకి తెచ్చింది. దీంతో ఆయన అందరి దృష్టిని ఆకర్శించా రు. అలా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1960లో ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషనన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) పట్టణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్ట డంతో సీపీఐతో అనుబంధం ఏర్పడింది. విద్యార్థి దశ లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1966లో ఏఐఎస్‌ఎఫ్‌ జనరల్‌ సెక్రటరీగా, 1970లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో డిల్లీకి వెళ్లిన ఆయన 1971లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌కు నామినేట్‌ అయ్యారు. 1985, 1990లో నాగర్‌కర్నూలు పార్లమెంటులోని కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 1994లో డోన్‌ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1998లో నల్గొండ నుంచి 12వ లోక్‌సభకు ఎన్నిక య్యారు. ఇదే ఏడాది స్టేట్‌ కౌన్సిల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. 2004లో నల్గొండ పార్లమెంట్‌ ఎంపీగా విజయం సాధించి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ లేబర్‌ చైర్మన్‌గా పని చేశారు. 2007లో సీపీఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా, 2012లో జనరల్‌ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన, పార్టీని ఎన్నో సవాళ్ల మధ్య ముందుకు నడిపించారు

స్వగ్రామంలో సామాజిక సేవ

సురవరం తన స్వగ్రామం కంచుపాడులో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2002లో తండ్రి సురవరం వెంకటరామిరెడ్డి పేరున విజ్ఙాన కేంద్రాన్ని స్థాపించారు. దీనిని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ సోషల్‌ ప్రోగ్రెస్‌ (సీడీఎస్‌పీ)కు అను బంధంగా నడిపారు. ఆ కేంద్రంలో వందలాదిమంది గ్రామీణ యువతులు, గృహిణులు కుట్లు, అల్లికలు, కంప్యూటర్‌, కుట్టుమిషన్‌ తదితరాల్లో ఉచిత శిక్షణ పొందుతున్నారు. గ్రామంలో ఎస్‌సీ కమ్యూనిటీ హాల్‌ ను కూడా ప్రారంభించారు. కరోనా సమయంలో గ్రామ ప్రజలకు అండగా నిలిచారు. ఏఐవైఎఫ్‌ ఆధ్వ ర్యంలో ఐసోలేషన్‌ కిట్లు, ప్రతీ ఇంటికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహి స్తున్నారు. మిషన్‌ భగీరథ పథకం లేని రోజుల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. జోగు ళాంబ రైల్వే హాల్ట్‌ ఏర్పాటులో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అందుకోసం అప్పటి ఎంపీ విఠల్‌రావుతో కలిసి పలుమార్లు డిల్లీ వెళ్లారు. ప్రజా ప్రతినిధిగా పార్లమెంటులో రైతులు, కార్మికులు, కూలీ లు, పేదల సమస్యలపై పొరాటం చేశారు. నిరాడం బర జీవనశైలి, ఆచరణత్మక రాజకీయ ప్రయాణం, వివాదాస్పద వాఖ్యలకు దూరంగా వింటూ.. విలువలు గల రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. 1961-62లో కర్నూలు ఉస్మానియా కాలేజీ లో నిర్వహించిన తెలుగు సాహితీ వారోత్సవాలను ముందుండి నడిపించారు. ఆ కార్యక్రమానికి దిగ్గజా లైన కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, మహా కవి శ్రీశ్రీ, అరుద్ర, రాయప్రోలు సుబ్బారావు, కృష్ణ శాస్ర్తి, పుట్టపత్రి నారాయణాచార్యులు హాజరయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, గవర్నర్‌ నాగేశ్‌ లను అహ్వానించి వైభవంగా నిర్వహించారు.

ఉద్యమమే జీవితం

ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు, మరెన్నో విజయాలు ఉన్నాయి. పాఠశాల స్థాయి నుంచే ఉద్యమాలకు ఉపిరి పోసిన ఆయన 2000లో విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ చేసిన ఆందోళనలో జైలుశిక్ష అనుభవించి, ధరల స్థిరీకరణతో విజయం సాధించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, మానవహక్కులపై పార్లమెంటులో బిల్లులు ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్‌ హయంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం తదితర అవినీ తి సమస్యలను లేవనెత్తారు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆయన ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ జనరల్‌ సెక్ర టరీగా, పార్టీ జాతీయ నాయకుడిగా ఎదిగారు. సెక్యు లరిజం, సోషలిజం, సామాజిక న్యాయం కోసం అలు పెరుగని పొరాటం చేశారు. ఆయన జీవితం యువతకు స్పూర్తి. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి.

స్ఫూర్తిదాయక ప్రేమ వివాహం

సురవరం జీవిత ప్రయాణంలో ప్రతీ మెట్టు స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. పార్టీ కార్యకర్తగా చేసిన మొదటి ప్రయాణంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విజ యలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి భావాలు ఏకం కావడంతో నిరాడంబరంగా వివాహం చేసు కున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు కపిల్‌ కర్ణాటకకు చెందిన ఓ బ్రాహ్మ ణ యువతిని వివాహం చేసుకున్నారు. మరో కు మారుడు నిఖిల్‌ ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నారు.

26న స్వగ్రామంలో వర్ధంతి సభ

హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుంభవన్‌లో శనివారం సురవరం ప్రథమ వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఆయన రాసిన వ్యాసాల సంకలనం ‘ఉద్యమాక్షరం’ను ఆవిష్కరిం చనున్నారు. ఈ నెల 26న ఆయన స్వగ్రామం ఉండవల్లి మండలం, కంచుపాడులో వర్ధంతి సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జాతీ య రహదారి నుంచి గ్రామానికి రూ.3 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూ జ చేయనున్నారు. గ్రంథాలయం ఏర్పాటుతో పా టు పాఠశాల భవన నిర్మాణం కోసం వారి కుటుం బం నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 11:37 PM