Share News

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:18 PM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం పార్టీల నాయకులు రాజకీయాలకతీతంగా కృషి చేయాలని జేఏసీ నాయకులు కోరారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయండి
డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న జేఏసీ నాయకులు

  • రాజకీయ పార్టీల నాయకులకు జేఏసీ నాయకుల వినతిపత్రాలు

గద్వాల టౌన్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం పార్టీల నాయకులు రాజకీయాలకతీతంగా కృషి చేయాలని జేఏసీ నాయకులు కోరారు. పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన కోసం ఏర్పడిన జేఏసీ నాయకులు ఆలూరు ప్రకాష్‌గౌడ్‌, మధుసూదన్‌బాబు నేతృత్వంలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేఏసీ నాయకులు, నడిగడ్డలో చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో 99, 100వ ప్యాకేజీ పనులు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గట్టు, తుమ్మిళ ఎత్తిపోతల పథకాల పూర్తితో పాటు ఆర్డీఎస్‌ ఆధునికీకరణ, జూరాల పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేసి సాగు, తాగునీరు అందించే బాధ్యత ప్రజాప్రతినిధులు, పార్టీలదేనన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ తహసీల్దార్‌ వీరభద్రప్ప, టీపీఎఫ్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ ప్రభాకర్‌, బహుజన రాజ్యసమితి నాయకులు వాల్మీకి, వినోద్‌కుమార్‌, సిద్ధార్థ కృష్ణ, దామోదర్‌ ఉన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:18 PM