యాసంగిలో ధాన్యం సేకరణకు చర్యలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:09 PM
2025-26 యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాలన్యూటౌన్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): 2025-26 యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రబీ యాక్షన్ ప్లాన్పై వివిధ శాఖల అధికారుల తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. రబీసీజన్ ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా చూడాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు అందు బాటులో పెట్టుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఓ.పి.ఎం.ఎస్లో నమోదు చేయాలని, అంతర్ రాష్ట్ర బోర్డర్స్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, పౌరసరఫరా జిల్లా మేనేజర్ విమల, జిల్ల కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.