రేషన్కార్డులపై పీఎం ఫొటో కూడా ఉండాలి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:34 PM
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించాలని బీజేపీ నాయకులు సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
బీజేపీ నాయకుల డిమాండ్
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
గద్వాల, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించాలని బీజేపీ నాయకులు సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకింద దేశమంతటా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేస్తున్నదని వివరించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దీనిని అమలు చేస్తున్నదని వివరించారు. ప్రతీ వ్యక్తికి నెలకు 5 కేజీల బీయ్యం ఇస్తుండ గా రాష్ట్ర ప్రభుత్వం ఒక కేజీని అదనంగా కలిపి ఆరుకేజీలు ఇస్తున్నదని వివరించారు. ఇందులో ప్రధాన వాటా కేంద్ర ప్రభుత్వానిదే ఉన్నప్పుడు ప్రధాన మంత్రి ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఈరోజు పేదలు ఆహార కొరత లే కుండా ఐదువేళ్లు నోట్లోకి పోతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యమేనని తెలిపారు. ప్రధాన మంత్రి ఫొటో పెట్టకపోతే సీఎం, సంబంధిత మంత్రి ఫొటోను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు.