Share News

పెండింగ్‌ కేసులు పరిష్కరించుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:34 PM

పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సి.సామ్‌కోషి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలతతో కలిసి ప్రారంభించారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరించుకోవాలి
బాధితులకు చెక్కును అందిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సామ్‌కోషి, హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలత

హైకోర్టు న్యాయమూర్తి సామ్‌కోషి

జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌

పాలమూరు యూనివర్సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సి.సామ్‌కోషి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయలోక్‌ అదాలత్‌ను వినియోగించుకొని ఇరుపక్షాలు పరస్పర సమ్మతి, అంగీకారంతో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, మోటారు ప్రమాద ఇన్సురెన్స్‌, బ్యాంక్‌ రుణాలు, చెక్‌బౌన్స్‌, కుటుంబ వివాదాలు వంటి అనేక కేసులను లోక్‌అదాలత్‌ ద్వారా రాజీ మార్గమే రాజమార్గమని పరిష్కరించుకోవాలన్నారు. లోక్‌అదాలత్‌లో ఇచ్చే తీర్పులు చట్టబద్ధమైనవని, అవి సివిల్‌ డిక్రీకి సమానమని చెప్పారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ లక్‌అదాలత్‌ ప్రధాన ఉద్దేశం ప్రజలకు సులభంగా, వేగంగా అతితక్కువ ఖర్చుతో కూడిన న్యాయం అందించడమేనన్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలత మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా 2,033 కేసుల పరిష్కరానికి మహబూబ్‌నగర్‌లో 7, జడ్చర్లలో 2 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతకు ముందు సామ్‌కోషి, శ్రావణ్‌ కుమార్‌లకు ప్రేమలత, కలేక్టర్‌ ఖుస్బూ గుప్తా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 11:34 PM