రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:28 PM
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది.
కల్వకుర్తి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ ఎస్.కురుమూర్తి కథనం ప్రకారం... వంగూరు మండలం కోనేటిపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్(27) కల్వకుర్తిలో గోల్డ్స్మిత్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తన పని మీద వంగూరుకు బైక్పై వెళ్లి రాత్రి తిరిగి కల్వకుర్తికి బయల్దేరాడు. ఈ క్రమంలో కల్వకుర్తి పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమాన్ దగ్గర రోడ్డు పక్కన పార్కింగ్ లేకుండా ఉన్న క్రేన్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో సాయికుమార్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి విషయం తెలుసుకున్న తల్లి జయమ్మ, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే సాయికుమార్ మృతి చెందా డు. రోడ్డు పక్కన అజాగ్రత్తగా ఎలాంటి పార్కింగ్ లైట్లు లేకుండా క్రేన్ నిలపడంతో తన కుమారుడు బైక్పై ఢీకొని మృతి చెందాడని, యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని...
రాజాపూర్, (ఆంధ్రజ్యోతి): మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ లో స్థానిక జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొన డంతో, ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి-44పై గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా, ఏదో వాహనం ఢీకొనడంతో సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, మృతుడి వివరా లు ఇంకా తెలియరాలేదని, ఎవరైన వ్యక్తి గల్లంతైనట్లు ఉంటే రాజాపూర్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు.