పాలమూరులో భారీ వర్షం
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:22 PM
పాలమూరులో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
- ఈ ఏడాది తొలిసారి 3.2 సెం.మీ కురిసిన వాన
మహబూబ్నగర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : పాలమూరులో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి వాతావరణం మేఘావృతం కావడం ఒక్కసారిగా వర్షం కుండపోతలా కురిసింది. ఈ సీజన్లో తొలిసారి 3.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. నగరంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కపోత, ఉబ్బరం నెలకొనగా ఆదివారం కురిసిన వానకు తేమశాతం పెరగడంతో వాతావరణం చల్లబడింది. హన్వాడ మండలంలో మోస్తారు వాన కురిసింది. మహబూబ్నగర్ రూరల్, భూత్పూర్, నవాబ్పేట మండలంలో వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆరుతడి పంటలకు కాస్త ఊరట లభించినట్లైంది.
జడ్చర్ల : ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు లేని ప్రస్తుత తరుణంలో ఆదివారం జడ్చర్లలో అరగంట పాటు మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే విత్తిన విత్తనాలకు కొంత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.