ట్యాంక్బండ్ను చూసి మాజీమంత్రి కంటతడి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:23 PM
‘మినీ ట్యాంక్బండ్ను మహబూబ్నగర్కు తలమానికంగా తీర్చిదిద్దాలనుకు న్నాం. కానీ నేడు దాన్ని చూస్తుంటే గుండె తరక్కుపోతుంద’ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కన్నీటిపర్యంతమయ్యారు.
మహబూబ్నగర్ న్యూటౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘మినీ ట్యాంక్బండ్ను మహబూబ్నగర్కు తలమానికంగా తీర్చిదిద్దాలనుకు న్నాం. కానీ నేడు దాన్ని చూస్తుంటే గుండె తరక్కుపోతుంద’ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కన్నీటిపర్యంతమయ్యారు. బుధవారం ఆయన ట్యాంక్బండ్ మీదుగా వెళ్తూ, దాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యం, ఆహ్లాదం పంచడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వ హయాంలో ట్యాంక్ బండ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నేడు దాన్ని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మీద కోపంతో అభివృద్ధి పనులను ఆపితే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద లేని వసతులు ఇక్కడ కల్పించామన్నారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని బస్టాండ్ వద్ద వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తే.. కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు కడితే వాటిని పూర్తి చేయడం లేదన్నారు. 15 రోజులకు ఒక్కసారి తాగునీరు వస్తుండగా, తాము వచ్చాక రోజూ నీరందించామని చెప్పారు. నేడు అవికూడా ఫిల్టర్ చేసి ఇవ్వడం లేదని చెప్పారు. ప్రజలు ఇలాంటి నాయకుల మాటలు నమ్మడం బాధ కలిగిస్తోందన్నారు.