ఆటాడుకుందాం రా!
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:15 AM
మహబూబ్నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీల సందడి నెలకొంది.
- జిల్లాలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీల సందడి
- పూర్తయిన మండలస్థాయి జట్ల ఎంపిక
- 20 నుంచి జిల్లా, చివరి వారంలో రాష్ట్రస్థాయి పోటీలు
మహబూబ్నగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీల సందడి నెలకొంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి పోటీలను నిర్వహించే తేదీలను ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. డైరెక్టర్ నుంచి జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది. డీఈవోల ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ కార్య దర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి పోటీల తేదీలను ఖరారు చేశారు. అందులో భాగంగా నిర్వహించిన మండలస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. పాఠశాల, కళాశాల స్థా యిలో అండర్-14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా ఎంపి కలు నిర్వహిస్తున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.
20 అంశాల్లో క్రీడా పోటీలు
మండలస్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడా అంశాల్లో పోటీలు ముగిశాయి. ఈనెల 20 నుంచి బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, హకీ, క్రికెట్, సాఫ్ట్బాల్, యోగా, అర్బరీ, బాక్సింగ్, నెట్బాల్, రగ్బీ, చెస్, తైక్వాండో, కరాటే, జూడో క్రీడా అంశాల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. చివరి వారంలో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలు ఉంటాయి. అదే సమయంలో అండర్- 19 ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.
పారదర్శకంగా క్రీడా పోటీలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను పారదర్శకంగా నిర్వహిస్తాం. మండలస్థాయిలో ఖోఖో, కబడ్డీ, ఖోఖో జట్ల ఎంపికలను పూర్తి చేశాం. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం. మిగతా క్రీడా అంశాల్లో నేరుగా జిల్లా, ఉమ్మడి జిల్లాస్థాయిలో ఎంపికలు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం.
- వేణుగోపాల్, అండర్-17,19 ఎస్జీఎఫ్ సెక్రటరీ