Share News

కార్పొరేషన్‌లో మరో డంపింగ్‌ యార్డు

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:07 PM

పాలమూరు కార్పొరేషన్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ కూడా పెరిగింది. దాంతో చిన్నదర్పల్లి శివారులో మరో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కార్పొరేషన్‌లో మరో డంపింగ్‌ యార్డు
మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న డంపింగ్‌ యార్డు

20 ఎకరాల్లో ఏర్పాటుకు చిన్నదర్పల్లి శివారులో స్థలం ఎంపిక

బయో మైనింగ్‌ మిషన్‌ కోసం టెండర్లు

నగరంలో రోజూ 106 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి

ప్రస్తుత డంపింగ్‌ యార్డుతో కాలుష్య సమస్యలు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పాలమూరు కార్పొరేషన్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ కూడా పెరిగింది. దాంతో చిన్నదర్పల్లి శివారులో మరో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో చెత్తను తరలించేందుకు ఇరవై ఏళ్ల కిందట(2004-05) కోయిలకొండ చౌరస్తా సమీపంలో 25 ఎకరాల స్థలంలో డంపింగ్‌ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రోజూ 60-70 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుతం విలీన గ్రామాలు కలిసి కార్పొరేషన్‌గా అవతరించింది. ఇప్పుడు రోజూ 106-110 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. చెత్తను తరలించేందుకు 70 ఆటోలు, 11 మునిసిపల్‌ ట్రాక్టర్‌లు, 12 ప్రైవేట్‌ ట్రాక్టర్లు పని చేస్తున్నాయి. 20 ఏళ్లుగా చెత్తను తరలించడంతో డంపింగ్‌ యార్డులో చెత్త కొండలా మారింది.

సెగ్రిగేషన్‌ చేయకపోవడంతో

డంపింగ్‌ యార్డ్‌లోని చెత్తను బ యోమైనింగ్‌ మిషన్‌ ద్వారా సెగ్రిగేషన్‌ చేస్తే చెత్త నిల్వలు తగ్గేవి. ఇరవై ఏళ్ళలో బయోమైనింగ్‌ చేసిన సందర్భాలు లేవు. కొద్దిరోజులు ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. దాంతో చెత్త నిల్వలు పెరుగుతూ, చివరకు స్థలం లేని పరిస్థితి నె లకొంది. దీనికి తోడు డంపింగ్‌ యార్డు చు ట్టూ కాలనీలు ఏర్పాటు కావడంతో అక్కడ నివాసం ఉండే వారు కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిత్యం పొగ ఇళ్లలోకి వె ళ్లి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వీరన్నపేట, టీడీగుట్ట, కోయిలకొండ ఎక్స్‌రోడ్‌, రవ్‌సాబ్‌దర్గా ప్రాంత కాలనీల ప్రజలు వాపోతున్నారు. డంపింగ్‌ యార్డ్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.

చిన్నదర్పల్లి శివారులో స్థల పరిశీలన

చిన్నదర్పల్లి శివారులోని గుట్ట ప్రాంతంలో నూతన డంపింగ్‌ యార్డు కోసం 20 ఎకరాల స్థలం ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ అధికారులు స్థల పరిశీలన చేసి, కలెక్టర్‌కు ఫైల్‌ పంపించారు. కలెక్టర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే డంపింగ్‌ యార్డు ప్రారంభం కానుంది.

బయోమైనింగ్‌కు టెండరు

కొత్త డంపింగ్‌ యార్డ్‌లో అయినా చెత్త ని ల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు బయో మైనింగ్‌ ద్వారా చెత్తను సెగ్రిగేషన్‌ చేయాలనే ప్రతిపాదన ఉంది. బయోమైనింగ్‌కు టెండర్లు కూడా పిలిచారు. ఈనెల 29 వరకు ఆన్‌లైన్‌ టెండర్‌ గడువు ఉంది. టెండరు దక్కిన ఏజెన్సీకి మిషన్‌ కోసం కార్పొరేషన్‌ డబ్బులు చెల్లించనుంది. మిషన్‌కు దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఖర్చు కానుంది.

రెండువైపులా అవసరం

నగరం విస్తరిస్తుండటంతో మరో డంపింగ్‌ యార్డు అవసరం ఉంది. కొత్త డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసినా ఎదిర, క్రిస్టియన్‌పల్లి నుంచి చిన్నదర్పల్లికి చెత్త తీసుకెళ్లాలంటే ట్రాక్టర్‌లు, ఆటోలకు దూరం పెరగండంతో నిర్వహణ భా రం పెరుగుతుంది. మరోవైపు డంపింగ్‌ యార్డు ఉండటం వల్ల ఎక్కడ దగ్గర ఉన్న డివిజన్‌లు ఆయా డంపింగ్‌ యార్డులకు చెత్తను తరలిస్తే ఖర్చు తగ్గ్గేందుకు అవకాశం ఉంటుంది.

Updated Date - Jun 26 , 2026 | 11:07 PM