డి ఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:28 PM
హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి కోరారు.
కేంద్ర రక్షణ కార్యదర్శిని కోరిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి కోరారు. బుధవారం న్యూఢిల్లీలో నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవితో కలిసి కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిని ఆయన కార్యాలయంలో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ ప్రగతికి దోహదపడేలా ఈ కారిడార్ను ఏర్పాటు చేయాలని గతంలో ప్రధాని మోదీకి, రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఈ కారిడార్ రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్శిస్తుందని చెప్పారు. దీనివల్ల హైదరాబాద్లోని డిఫెన్స్ హబ్లను, బెంగుళూరులోని ఎరోస్పేస్ యూనిట్లను కలుపుతూ ఒక సమగ్ర పారిశ్రామిక జోన్గా అభివృద్ధి చెందుతుందని రక్షణ శాఖ కార్యదర్శికి వివరించారు. వెంటనే కారిడార్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీంతోపాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన సంస్థ నిర్మించ తలపెట్టిన బ్రహ్మోస్ వంటి క్షిపణులు తయారుచేసే ఇంటిగ్రేటెడ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్కు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి కాంప్లెక్స్ను పూ ర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రా యోజిత పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.