ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:40 AM
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులు 25ు రాయితీతో ఫీజు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాయితీ అమలు గడువును ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు నాలుగు నెలల పాటు పొడిగించింది.
నవంబరు 30 వరకు రుసుముపై 25 శాతం రాయితీ అమలు
పురపాలక శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులు 25ు రాయితీతో ఫీజు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాయితీ అమలు గడువును ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు నాలుగు నెలల పాటు పొడిగించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పురపాలక శాఖ శుక్రవారం జారీ చేసింది. అక్రమ లేఅవుట్ నిబంధనలు 2020 కింద లేఅవుట్ క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా ఈ రాయితీని సద్వినియోగం చేసుకోవచ్చు. రాయితీ అమలుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగం, రాష్ట్రంలోని అన్ని అర్బన్ డెవల్పమెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 20లక్షల మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపునకు సంబంధించి లేఖలు పంపా రు. అయితే, ఈ రుసుము చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకురాకపోవడంతో ప్రభుత్వం రుసుములో 25శాతం రాయితీ కల్పిస్తూ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాయితీ గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రభుత్వం.. శుక్రవారం మరోసారి పొడిగించింది.