కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద శుద్ధి కేసులో ఏడుగురి అరెస్టు
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:27 AM
సిద్దిపేట జిల్లా మర్కుర్ మండలం ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాలను పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.
14 రోజుల రిమాండ్.. సిద్దిపేట జైలుకు తరలింపు
మర్కుక్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుర్ మండలం ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాలను పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా వరదరాజ్పూర్ మాజీ సర్పంచ్ అప్పాల ప్రవీణ్తో పాటు రెడ్డిమల్ల అమరేందర్, శ్రీపతి రాజు, ముచ్చపతి హిమవంత్, అంతాని ఐలయ్య, అర్కాల రాజు, అంతాని మల్లేశ్లను విజయవాడలోని ఓ లాడ్జిలో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నిందితులను గజ్వేల్కు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఆయన వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతర నిందితులను సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. దళితులను అవమానించారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లు ఏసీపీ నర్సింహులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.