మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:32 PM
మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో రూ.10 లక్షల నిధులతో తలపెట్టిన మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్ధేశ్యంతో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని సర్కారు అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను పట్టించుకోకపోవడంతో పాటు రుణాలు, వడ్డీలను చెల్లించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పావలా వడ్డీ రుణాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిదని అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 160 మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి మద్ధతు ధరను అందించారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతోందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలనను కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తోందని అన్నారు. అర్హులైన వారందరికీ ఆగస్టు15న పింఛన్లు అందించడంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా వర్తింపజేయనుందని అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సంగీతం శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సరోజన, ఏఎంసీ చైర్పర్సన్ సబేరాబేగం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్, నాయకులు గిరిధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డి, సాహెబ్, గౌస్, తిరుపతి పాల్గొన్నారు.