Share News

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:01 AM

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నారు.

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి
మాట్లాడుతున్న ఎస్పీ అశోక్‌ కుమార్‌

ఎస్పీ అశోక్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో ఆదివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీస్‌ సిబ్బందికి ఫ్రీ హెల్త్‌ క్యాంప్‌, క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు వచ్చే రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, హెచ్‌పీవి వ్యాక్సినేషన్‌ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు చనిపోతున్నారని, క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం ముప్పు తగ్గించవచ్చని అన్నారు. మహిళలు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తోటి మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌ సిబ్బంది ఉద్యోగ విధుల్లో నిమగ్నమై ఉంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐయంఏ అధ్యక్షుడు డా. గూడూరి హెమంత్‌, వైద్యులు ప్రవీణ్‌ కుమార్‌, పద్మిని, శ్రీలత, రజిత, ఎస్‌ గీతా, మహిళ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:01 AM