అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:09 AM
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ ప్రకటించారు.
-చైర్పర్సన్గా అడువాల జ్యోతి, సమిండ్ల వాణి పేర్ల ప్రతిపాదించా
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా నిర్వహిస్తున్న క్యాంపులో తన అనుచర విజేతలు, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్యతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాలలో కౌన్సిలర్గా గెలుపొందిన సమిండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదించానని ప్రకటించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించానని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జీవన్రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారని ఆరోపించారు. మాది మొదటి నుండి కాంగ్రెస్ కుటుంబమేనని, మా తాతలు కాంగ్రెస్ నుండి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పని చేశారని వివరించారు. జగిత్యాల పట్టణ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానన్నారు.