బీఫామ్ దక్కేదెవరికో..?
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:28 AM
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
హుజూరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, బీఫామ్ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు పార్టీల తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు బీఫామ్ అప్పగించాల్సి ఉంటుంది. అదే సమయానికి నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు.
ఫ వ్యూహాత్మకంగా అడుగులు...
పార్టీ ప్రకటించిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండేలా అసంతృప్తులను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా రెబల్స్ను దారికి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నామినేషన్ వెనక్కి తీసుకుంటారో వారికి భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇక పార్టీ నుంచి బీఫామ్ వస్తుందని సంకేతాలు ఉన్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే, మరో పక్క అసమ్మతివాదులను కలుపునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఫ ప్రధాన పార్టీలకు సవాల్
హుజూరాబాద్ మున్సిపాలిటీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడం ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. ప్రధాన పార్టీల నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 189 మంది అభ్యర్థులు 304 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 89, బీఆర్ఎస్ 77, బీజేపీ 79, బీఎస్పీ 4, ఇతర పార్టీలు 16, ఇండిపెండెంట్ 39 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీ నేతలు ఒక్కొక్కరికి బీఫామ్ ఇవ్వనుండగా మిగతా వారిని బుజ్జగించడంపై నేతలు దృష్టి సారించారు. సోమవారం ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు.