మోదీని గద్దె దింపే వరకు పోరాడతాం..
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:31 AM
దేశంలో బీజేపీ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, మోదీని గద్దె దింపే వరకు పోరాడతామని సీపీఐ నాయకుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
సైదాపూర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో బీజేపీ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, మోదీని గద్దె దింపే వరకు పోరాడతామని సీపీఐ నాయకుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. సీపీఐ ప్రచార జాత మూడోరోజు శనివారం సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ ప్రచార జాత నిర్వహిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు. సెప్టెంబరు 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి అందె స్వామి, పొన్నగంటి కేదారి, బోయిని అశోక్ పాల్గొన్నారు.
ఫ చిగురుమామిడి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీపీఐ చాడ వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ ప్రచార జాత శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు.