ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి ఇబ్బందులు
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:19 AM
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కరీంనగర్ టౌన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎల్ఎండీ నీరు లేక మైదానంలా మారిందని, ఆటలు ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్చేసి మిడ్మానేరు, ఎల్ఎండీలను నింపాలన్నారు. పభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీష్రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్చేసి ప్రజలకు సాగు, తాగునీరందిస్తామన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం లేదని, ఎల్ఎండీలో 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, మూడు టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీగా ఉంటుందని, మిగిలిన రెండు టీఎంసీల ద్వారా కరీంనగర్ ప్రజలకు తాగునీరందించలేమన్నారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో ప్రతిరోజు తాగునీరు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యధోరణితో ప్రస్తుతం రెండు, మూడురోజలకొకసారి కూడా పూర్తిస్థాయిలో తాగునీటిని అందించలేక పోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడు 10.3 టీఎంసీల నీటి నిలువలు ఉండే విధంగా జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్సింగ్, నాయకులు పాల్గొన్నారు.