సమన్వయ లోపంతో మందకొడిగా ఓటర్ల సవరణ
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:07 AM
జిల్లా అధికార యంత్రాంగం, బీఎల్వోల మధ్య సమన్వయ లోపంతో నగరంలో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, ఇప్పటి వరకు 14శాతం మాత్రమే పూర్తయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా అధికార యంత్రాంగం, బీఎల్వోల మధ్య సమన్వయ లోపంతో నగరంలో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, ఇప్పటి వరకు 14శాతం మాత్రమే పూర్తయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అర్హులైన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 10 హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం నగరంలోని కిసాన్నగర్, చింతకుంటలలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు సవరణ హెల్ప్డెస్క్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్యోద్దేశమని తెలిపారు. జూలై 24లోపు నూరుశాతం ఓటరు సవరణ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉందని, ఆన్లైన్ సర్వర్లు సరిగా పనిచేయక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్కుమార్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.