వేములవాడ మున్సిపల్ అంచనా బడ్జెట్ రూ.26.68 కోట్లు
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:23 AM
వేములవాడ మున్సిపల్ పాలక వర్గం 2026-27 వార్షిక అంచనా బడ్జెట్ రూ.26.68 కోట్లకు ఆమోదం తెలిపింది.
వేములవాడ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): వేములవాడ మున్సిపల్ పాలక వర్గం 2026-27 వార్షిక అంచనా బడ్జెట్ రూ.26.68 కోట్లకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యా రు. బడ్జెట్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్కు వచ్చే ఇతర ఆదాయంతో కలుపుకుని రూ. 26 కోట్ల 68 లక్షల ఆదాయాన్ని అంచనా వేశారు. ఇందులో మున్సిపల్ స్వంత నిధుల నుండి అంచనా ఆదాయం రూ.17.68కోట్లు, వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదా యం రూ.9కోట్లు అంచనా వేయగా రూ.26.05 కోట్ల వ్యయం అవుతున్నట్లు అంచనా వేశారు. మిగులు అంచనా రూ.60లక్షలగా బడ్జెట్ వుండనున్నట్లు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో వైస్చైర్మన్ నరాల శేఖర్, కమి షనర్ సంపత్కుమార్, మేనేజర్ సంపత్రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.
పకడ్బందీగా పారిశుధ్య పనులు, నీటి సరఫరా..
వేసవి కాలం ప్రారంభం కావడంతో వేములవాడ మున్సిపల్ పరిధిలో నిత్యం పారిశుధ్య పనులు, నీటి సరఫరా పనులు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవా రం ఏర్పాటుచేసిన బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ అందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశా మన్నారు. నూతన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. బడ్జెట్ మీటింగ్ చాలా కీలకమని, రెవెన్యూ వ్యయంలో భాగంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుధ్య పనులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయన్నారు. తప్పనిసరిగా 10శాతం గ్రీన్బడ్జెట్ ఖర్చు చేయా లని స్పష్టం చేశారు. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, సంరక్షణకు ఖర్చు చేయాలని సూచించారు. మున్సిపల్ మొత్తం బడ్జెట్లో 1/3 శాతం విలీన గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులందరికీ వెంటనే బీమా చేయించాలని కమి షనర్ను ఆదేశించారు. మున్సిపల్కు రావాల్సిన పన్నులు 100శాతం వసూ లు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. మున్సిపల్ వార్డు సభ్యులు తమ పరిధిలో ఇంటి, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేందుకు సహకరించాలని తెలిపారు. పట్టణంలోని అన్ని షాపులు లైసెన్స్లు తీసుకునేలా చూడాలన్నారు.మున్సిపల్ నిధులతో నిర్మించిన భవనాలు అన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి రోజు పారిశుధ్య పనులు పక్కాగా చేయించాలని, తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లా రు. తడి చెత్తను ఎరువుగా చేసి విక్రయించాలని, పొడి చెత్తను విక్రయిస్తే బల్దియాకు ఆదాయం వస్తుందని తెలిపారు. పార్క్లు, వైకుంఠధామాలు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. వేముల వాడ గుడిచెరువు బండ్ పార్క్ ప్రారంభానికి సిద్ధం అవుతుందని, నిర్వ హణ సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఆర్సీసీ కేం ద్రం నిర్వహించాలని, నాంపల్లి గుట్టపై ఎయిర్ఫోర్స్ యుద్ధ విమానం ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య రాకుండా వార్డు సభ్యులు, అధికారులు చూసుకోవాలని తెలిపారు. ఏమైనా మరమ్మతు ఉంటే చేయించాలని సూచించారు.
బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల అభ్యంతరం..
వేములవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కమిషనర్ సంపత్కుమార్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ బడ్జెట్ సమా వేశానికి కౌన్సిలర్లకు కనీసం వారం రోజుల ముందు నోటీసులు అందించా లని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముందస్తుగా నోటీసులు అందించి గడువు ఇవ్వకుండా సమావేశాన్ని నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు. గడువు ఇవ్వకుండా బడ్జెట్ సమావే శాన్ని నిర్వహించిన తీరుపై మినిట్స్ బుక్లో నమోదు చేయాలని కౌన్సిల ర్లు డిమాండ్ చేశారు. దీంతో తరువాత చేస్తామని కమిషనర్ చెప్పడంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందుకు వచ్చి నిర సన వ్యక్తం చేశారు.