కదం తొక్కిన కార్మిక లోకం
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:08 AM
కార్పొరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కరీంనగర్లో కార్మిక లోకం కదం తొక్కింది.
గణేష్నగర్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కరీంనగర్లో కార్మిక లోకం కదం తొక్కింది. జైల్భరో కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కళాభారతి నుంచి తెలంగాణ చౌక్ వరకు సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పకొట్టే వరకు శ్రామిక వర్గం ఉద్యమిస్తుందన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికే కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చారన్నారు. అమెరికాతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు దేశంలోని వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ చౌక్లో ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నాయులను పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుంకరి సంపత్, యు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, రాజమల్లు, ఎంశ్రీలత, కొప్పుల శంకర్, ఎం మహేందర్ పాల్గొన్నారు.