‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’పై ప్రజెంటేషన్ ఆకట్టుకోవాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:07 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, వార్డుసభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, వార్డుసభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. నూతనంగా ఎన్నికైన వారు సహా, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజలకు లబ్ధి చేకూర్చే వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటి అమలు, లబ్ధి పొందే విధానంపై వివరించాలని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధుల పాత్రపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మికిరణ్, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, డీవైఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.