Share News

మెజారిటీ స్థానాలు బీజేపీకే..

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:36 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించబోతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

మెజారిటీ స్థానాలు బీజేపీకే..
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించబోతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఫలితాల వైపు చూస్తున్నదన్నారు. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కలవరం మొదలైందని, ప్రలోభాలకు గురి చేసి బీజేపీ కార్పోరేటర్లను గుంజాలని చూస్తున్నారన్నారు. బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్‌ నేతలు ఫోన్లు చేస్తు స్కెచ్‌ వేస్తున్నారన్నారు. పార్టీని మోసం చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్లే అన్నారు. అధికార పార్టీ ఆశలకు లోబడి ఎవరైనా కాంగ్రెస్‌లోకి వెళితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, కార్యకర్తల ఆవేశాన్ని తట్టుకోవడం అసాధ్యమని హెచ్చరించారు. మాజీ మేయర్‌ సునీల్‌రావు కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి సీటు పార్టీకి ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, మాజీ మేయర్‌ సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేష్‌, వాసాల రమేష్‌, సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:36 PM