Share News

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

ABN , Publish Date - May 21 , 2026 | 12:42 AM

జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబి తా సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు.

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

సిరిసిల్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబి తా సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీల ప్రతి నిధులు, సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 1, 2026ను ప్రామాణిక తేదీగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్య మని తెలిపారు. ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రతిరాజకీయ పార్టీ బూత్‌ స్థాయిలో బీఎల్‌ఏలను నియమించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించా లని సూచించారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. జూన్‌ మొదటి వారం లో మండలస్థాయిలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్‌ 15నుంచి 24వరకు ఎస్‌ఐఆర్‌లో పాల్గొనే బీఎల్‌వోలు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్‌ 25 నుంచి జూలై 24వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓట ర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాలో లేని ప్రతి ఒక్కరూ తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకరిం చాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, సరైన పత్రాలతో ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు. మరణించిన ఓటర్లు, డూప్లికేట్‌ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. జూలై 31,2026న డ్రాఫ్ట్‌ ఎస్‌ఐఆర్‌ ఓట రుజాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్‌ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. డ్రాఫ్ట్‌ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్‌ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. ఆ సమయంలో భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం పుట్టిన సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్‌ 28, 2026 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి, అక్టోబర్‌ 1, 2026న తుది ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాను విడు దల చేస్తామన్నారు. డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫారం-8 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాజేందర్‌ రెడ్డి, కేఎస్‌బీ కుమారి, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:42 AM