కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్రం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:48 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను, చట్టాలను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ విమర్శించారు.
భగత్నగర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను, చట్టాలను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ విమర్శించారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలోని అమరజీవి మాదన నారాయణ స్మారక ప్రాంగణంలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభల ముగింపు సమావేశంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యంచేసే కుట్రలు పన్నుతుందన్నారు. 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించిందన్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారితో పాటు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికి దుర్భర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. కార్మికులంతా ఏకమై పాలక ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్రాజ్, చీఫ్ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి, ప్యాట్రన్ కలవేన శంకర్, అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతినిధుల మహాసభకు అధ్యక్ష వర్గంగా టేకుమల్ల సమ్మయ్య, ప్రేమ్ పావని, వాసిరెడ్డి సీతారామయ్య, యూసుఫ్ వ్యవహరించారు.
ఫ కార్యదర్శి నివేదికపై చర్చ
రాష్ట్ర కార్యదర్శి నివేదికపై 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. లేబర్ కోడ్ల రద్దు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలనలి డిమాండ్ చేశారు. 33 జిల్లాల నుంచి 650 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వనితులు, అందులో 92 మంది మహిళా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు.