సమసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:26 AM
సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని, నా గురువులు నేర్పిన విద్యాబుద్ధులు, వారు చూపిన మార్గంతోనే ఐపీఎస్ సాధించి ఈ స్థాయిలో ఉన్నానని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని, నా గురువులు నేర్పిన విద్యాబుద్ధులు, వారు చూపిన మార్గంతోనే ఐపీఎస్ సాధించి ఈ స్థాయిలో ఉన్నానని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలను నింపడంలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని అన్నారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలను అలవాటు పడి బండారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, ఎస్ఐలు రమేశ్, లక్ష్మణ్, శ్రీకాంత్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా విధులు
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, ఠాణా పరిసరాలు, కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది హాజరును పరిశీలించారు. పోలీసు సిబ్బంది ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు. అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, ఎస్ఐలు రమేశ్, లక్ష్మణ్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.