ఊపిరి సలపని ఉక్కపోత..
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:10 AM
వానాకాలమా..? ఎండాకాలమా..? అనే విధంగా గడిచిన రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.
- పెరిగిన ఉష్ణోగ్రత
- వేసవిని తలపించేలా ఎండ తీవ్రత
- రెండ్రోజుల్లో పెరిగిన విద్యుత్ వాడకం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
వానాకాలమా..? ఎండాకాలమా..? అనే విధంగా గడిచిన రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఇన్నాళ్లు మేఘాల చాటునుంచి అడపాదడపా అగుపించే సూరీడు ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఈ సారి ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అంచనాలు వేసినట్టే జిల్లాలో భానుడి భగభగలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఉక్కపోత జిల్లా జనాలను ఊపిరి సలపకుండా చేస్తోంది. జూన్ ప్రారంభం నుంచి వర్షాకాలం మొదలవగా.. మధ్య మధ్యలో కురిసిన వర్షాల వల్ల వాతావరణం చల్లబడింది. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో కొన్ని రోజులు మేఘావృతమైన ఆకాశాలు కనిపించాయి. వారం రోజులుగా చినుకుల జాడలేకపోవడంతో జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెల 1వ తేదీతో పోలిస్తే 7 వరకు దాదాపుగా 4-6 డిగ్రీ సెల్సియస్ల ప్రభావం పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీలు ఉండగా ఇప్పుడు 37 డిగ్రీలు దాటింది.
నాలుగు రోజుల్లో జిల్లా ఉష్ణోగ్రతలు
(డిగ్రీ సెల్సియస్లో)
------------------------
తేది కనిష్ఠం గరిష్ఠం
-------------------------
4 22.7 34.2
5 23.2 35.1
6 23.5 35.9
7 25.4 37.1
--------------------------
ఫ గాలిలో తేమ అధికంగా..
మండు వేసవిని తలపించే విధంగా జిల్లాలోని ఉష్ణోగ్రతలకు తోడుగా విపరీతమైన వడగాలి ప్రభావం పెరిగింది. గాలిలో తేమ అనూహ్యంగా పెరగడంతో ప్రజలకు ముచ్చెమటలు తప్పడం లేదు. ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం 30 డిగ్రీలకుపైగా ఉన్నప్పుడు గాలిలో తేమ గరిష్ఠస్థాయికి చేరుతోంది. వాస్తవానికి 40 నుంచి 50 శాతం తేమ ఉంటేనే ఉక్కపోత తారాస్థాయికి చేరుతుంది. జిల్లాలో గడిచిన రెండ్రోజులుగా 66 నుంచి 88 శాతం వరకు గాలిలో తేమ పెరిగింది.
- 7న చిగురుమామడి మండలంలో రికార్డు స్థాయిలో 89.8 శాతం గాలితో తేమ నమోదైనట్లు వాతావరణశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
- చొప్పదండి మండలం వెదురుగట్టలో సాయంత్రం 4గంటల సమయంలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఫ ఏసీలు, కూలర్లతో ఉపశమనం
జిల్లాలో పెరిగిన ఉక్కుపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలను ఇళ్లల్లోనూ కార్యాలయాల్లోనూ ఎక్కువగా వాడటం కనిపించింది. గత రెండ్రోజులుగా రాత్రి వేళ్లల్లోనూ వడగాలి ప్రభావంతో వేసవి కాలం మాదిరిగానే కూలర్లు, ఏసీలు వినియోగించడంతో విత్యుత్తు వాడకం పెరిగింది. జిల్లాలో ఎండకాలం కాకుండా మిగతా రోజుల్లో సగటున రోజుకు 11 నుంచి 12 మిలియన్ యూనిట్ల కరెంట్ను వాడుతున్నారు. గడిచిన రెండ్రోజుల్లో సుమారు 12 మిలియన్ యూనిట్లకుపైగా కరెంట్ వినియోగం జరిగిందని విద్యుతుశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశముంది. ఇప్పటికే జిల్లాలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. మళ్లీ వర్షాలు కురిస్తేనే వాతావరణంలో మార్పు కనిపించే వీలుంది.