వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకారం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:49 AM
పరాభవన నామ సంవత్సరం చైత్ర శుద్య పాఢ్యమిని పురష్కరించుకుని నేటి నుంచి ఈనెల 27వ తేది వరకు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు ఆలయాధికారులు శ్రీకారం చుట్టారు.
వేములవాడ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పరాభవన నామ సంవత్సరం చైత్ర శుద్య పాఢ్యమిని పురష్కరించుకుని నేటి నుంచి ఈనెల 27వ తేది వరకు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు ఆలయాధికారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీస్వామి వారికి ఉదయం స్వస్తి పుణ్యావాచనం, రుత్విక్ వరణంతె కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. కాగా శ్రీలక్ష్మీ గణపతి స్వామికి అభిషేకం, శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారికి ఉపచార పూజలు, శ్రీ సీతరామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ విధానంలో అభిషేక పూజ ఘనంగా నిర్వహించి పరివార దేవత మూర్తులకు అర్చన కార్యక్రమాలను చేపట్టారు. అంతే కాకుండా శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు రామాయణ పురాణ పారాయణం, ప్రవచనాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీభీమేశ్వర ఆలయ సమీపంలోని శంకరమఠంలో ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు రామాయణ ప్రవచనలు తొమ్మిది రోజులపాటు భక్తులను ఆధ్మాత్మికంగా అలరించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ది కార్యక్రమంలో భాగంగా, అర్చకులు, వేద పండితులు ఈ పూజలను ఏకాంతంగా నిర్వహించగా ఆలయ ఈవో రమాదేవి అర్చకులకు అవసరమైన సహాకారం అందించారు.