ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - May 02 , 2026 | 11:22 PM
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందులో భాగం గా శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చిత్ర మిశ్రా పేర్కొన్నారు.
గంగాధర, మే 2 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందులో భాగం గా శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చిత్ర మిశ్రా పేర్కొన్నారు. శనివారం గంగాధర మండలం వెంకటయ్యపల్లిలో నియోజకవర్గస్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ స్ర్తీ, శిశు సంక్షేమం. స్థాని సంస్థలు, ఇందిరమ్మ ఇల్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి వారీగా దరఖాస్తులు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
ఫ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సన్న బియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివ రించారు. గత ప్రభుత్వం వరి వేసుకుంటే ఉరిని చెప్పిందని, సన్న రకాలకు 5వందల బోనస్ ఇస్తూ రైతులకు అండగా ఉంటున్నామన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల పాదాలు కడుతామని ఎమ్మెల్యే పేర్కొ న్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గంతో పాటు వేములవాడ నియోజకవర్గాలకు సాగునీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఇప్పటికే నారాయణపూర్ ప్రాజెక్టుకు 23.5కోట్లు మంజూరు చేశామని, మరో 20 కోట్లు త్వరలో విడుదల అవుతాయని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, అధికారులను కోరారు. సర్పంచులు ఊరి అభివృద్ధిపై దృష్టి సారించండని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తరువాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.