పక్కాగా భూముల వివరాల సేకరణ
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:53 AM
క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో భూముల రీసర్వేపై మంగళవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ మాట్లాడుతూ భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూముల రీసర్వేను చేపట్టిందన్నారు. గ్రామాల్లో సర్వే చేసే ముందు జీపీవోలు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్వే నంబర్ల భూముల సమాచారాన్ని రైతులకు అందించాలని అధికారులకు సూచించారు. గ్రామ సరిహద్దుల రీసర్వే, ఇతర అంశాలను తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సర్వేను పారదర్శకంగా చేపట్టి వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి అపోహాలకు తావివ్వకుండా రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ దివ్యజ్యోతి, సర్పంచ్ ప్రమీల, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.