మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలి
ABN , Publish Date - May 24 , 2026 | 12:14 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మొక్కల నాటే లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మే 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మొక్కల నాటే లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శనివారం వన మహోత్సవంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టబోయే పర్యావరణ వారం గురిం చి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, స్థలాల గుర్తింపు చేసి ఉంచాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని, మియావాకి ప్లాంటేషన్పై దృష్టి సారించాలని ఆదేశించారు. స్థలాల గుర్తించి అన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు పక్కా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోయిన, పెరగకపోయిన వాటి స్థానంలో ఇప్పుడు వన మహో త్సవంలో భాగంగా మళ్లీ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కల లక్ష్యాలు వివరించారు. గ్రామీణ అభివృద్ధి శాఖకు 5లక్షల 70వేలు, సిరిసిల్ల మున్సిపాలిటీకి లక్షా, అటవీ శాఖకు 75వేలు, వేములవాడ మున్సిపాలిటీకి 50వేలు, వ్యవసాయ శాఖకు 25వేలు, ఎక్సైజ్ శాఖకు 20 వేలు, ఉద్యానవన, నీటి పారుదల 15వేల చొప్పున, విద్యా శాఖకు 10వేలు, పోలీస్ శాఖ, ఆర్అండ్బీ శాఖకు 4 వేల చొప్పున, వైద్య ఆరోగ్య శాఖకు 2వేలు, పరిశ్రమల శాఖకు వేయ్యి, మైనింగ్ శాఖకు 200 కలిపి మొత్తం 8లక్షల 91వేల 200గా లక్ష్యాన్ని నిర్ణయించామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఈవో జగన్మోహన్రెడ్డి, డీపీవో షర్ఫుద్దీన్, డీఏవో అఫ్జల్ బేగం, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ కమిషనర్లు ఖదీర్పాషా, లోకేష్, వివిధ శాఖల అధికారులు తదిత రులు పాల్గొన్నారు.