పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:05 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్ టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని కృషీభవన్లో డీటీఎఫ్ జిల్లా 16వ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సంబంధమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన గత పీఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్, జీఐఎస్, టీఎస్జీఎల్ఐ బిల్లులను ఒకేసారి చెల్లించాలని కోరారు. ఎన్నికల పరిశీలకుడిగా హాజరైన డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి శ్యామ్ మాట్లాడుతూ జీవో 25లో అనేక లోపాలున్నాయని, వాటన్నింటిని సవరించిన తర్వాతనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎలాంటి బోధనేతర పనులు కేటాయించవద్దన్నారు. ప్రతి పాఠశాలకు నైపుణ్యం కలిగిన కంప్యూటర్ ఆపరేటర్ను నియమించాలన్నారు. రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం రఘుశంకర్రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలోని ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రాంమోహన్ నివేదిక సమర్పించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి, రాష్ట్ర పూర్వ కార్యదర్శి కోహెడ చంద్రమౌళి, జిల్లా కమిటీ సభ్యులు హుమేరా జబీన్, టి తిరుపతిగౌడ్, ఎ శ్రీనివాస్, ఆర్ శంకరయ్య, బి రమేశ్, ఎస్ చక్రధర్, యు శంకర్, ఎస్ సంపతి, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ అంజయ్య, కె కిషన్రెడ్డి, తూముల తిరుపతి, ఎం సదానందం, సీహెచ్ దేవేందర్, వి రాంకిరణ్, పి అరుణాదేవి, కె సంధ్యారాణి పాల్గొన్నారు.