Peddapalli: కాంగ్రెస్ పాలనలో దివాళా దిశలో రాష్ట్రం
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:18 AM
పెద్దపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ దివాళా దిశగా పయనిస్తోందని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
పెద్దపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ దివాళా దిశగా పయనిస్తోందని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పట్టణంలోని సర్వాయిపాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల మోటార్లను కావాలనే ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రసంస్థల నివేదికలు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ముఖం చెల్లకుండా కేసీఆర్పై అబాండాలు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని, అలాంటి కుట్రలు చేస్తే ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.