వర్షాకాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:21 AM
వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.
వేములవాడ రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి చెరువులో భారీవర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) సిబ్బందికి బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి చెరువులో ప్రయాణించి సహాయక చర్యల నిర్వహణను పరిశీలించారు. డీఆర్ఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజల రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతివైపరిత్యాల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగంతోపాటు ఆర్ఐ ఆధ్వర్యంలో 12 మంది సభ్యులతో కూడిన డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా డీఆర్ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోటు, మెడికల్ స్ర్టెచర్, లైఫ్ జాకెట్లు, లైఫ్బాయ్స్, ఉడ్కటర్ లాంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్లు గమనించినా, సహాయం అవసరమైనా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఆర్ఐ అడ్మిన్ సురేష్, ఆర్ఎస్సైలు సాయి కిరణ్, శ్రావణ్యాదవ్ డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.