Share News

అత్యధిక కాలం దేశ ప్రధానిగా మోదీ

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:23 AM

అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసి నెహ్రూ రికార్డును నరేంద్రమోదీ బద్దలు కొట్టారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

అత్యధిక కాలం దేశ ప్రధానిగా మోదీ
మహాశక్తి దేవాలయంలో పూజలు చేస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసి నెహ్రూ రికార్డును నరేంద్రమోదీ బద్దలు కొట్టారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. భారత ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని మహాశక్తి ఆలయంలో ఆయన బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే 2047 వరకు ప్రధానమంత్రిగా కొనసాగుతారన్నారు. మోదీ పాలనలో దేశం అనూహ్యమైన ప్రగతి సాధించిందన్నారు. కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ పత్రాలను తిరస్కరించిన వ్యవహారం ఎన్నికల కమిషన్‌ పరిధిలోనిదని, ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్‌ చూసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు పాల్గొన్నారు.

ఫ స్వచ్ఛ పాఠశాలలలో భాగస్వాములు కావాలి

స్వచ్ఛ పాఠశాలలో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు, పార్టీల కండువాలను పక్కపెట్టి అందరూ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఈ నెల 13న స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. సర్కారు బడిని కాపాడుకుంటే పేద, మధ్య తరగతి పిలల చదువుకు భరోసా కల్పించినట్లే అన్నారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా 13న చిగురుమామిడి మండలం రేకొండ పాఠశాలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొంటానన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:23 AM