సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:27 AM
లేబర్ కోడ్స్, వీబీ జీ రామ్జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు పిలుపునిచ్చారు.
సుభాష్నగర్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): లేబర్ కోడ్స్, వీబీ జీ రామ్జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి దేశవ్యాప్త ఉద్యమంలో జిల్లాలోని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని, రాజ్యాంగ రీత్యా విత్తన చట్టం రాష్ట్రాల పరిధిలోనిదని అన్నారు. 2004లో రైతు సంఘాల పోరాట ఫలితంగా విత్తన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారన్నారు. కార్పొరేట్ సంస్థలు చట్టం కాకుండా అడ్డుకున్నాయని విమర్శించారు. ఇంత కాలం రాష్ట్రాల పోరాటం వల్ల కేంద్రం చట్టం చేయలేదన్నారు. ఈ చట్ట ప్రకారం ఇక నుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుందని, విద్యుత్ చార్జీలు కేంద్రమే రెగ్యులెటరీ కమిషన్ ద్వారా నిర్ణయిస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ హక్కును దెబ్బతీసే వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి అజయ్, సీఐటీయూ నాయకులు ఎడ్ల రమేష్, జి రాజేశం, కొప్పుల శంకర్, జనగామ రాజమల్లు, ఎం శ్రీలత, రైతు సంఘం నాయకులు సీహెచ్ రాములు, సంపత్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్ సంపత్, మాతంగి శంకర్, రాయి కంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.