హిందూ ఏక్తా యాత్రతో చరిత్ర సృష్టిద్దాం
ABN , Publish Date - May 04 , 2026 | 12:49 AM
కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేసి మరోసారి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
భగత్నగర్, మే 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేసి మరోసారి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈనెల 12న కరీంనగర్ లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లపై ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పోరేటర్లు జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ హిందూ ఏక్తా యాత్రకు చిన్నా, పెద్దా, ముసలి ముతకా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలన్నారు. యాత్రకు తరలివచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, వారికి తగిన రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏక్తాయాత్రపై మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పార్టీ నాయకులంతా తమ వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఏక్తా యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలన్నారు. హిందూ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన నేపథ్యంలో ఆ స్పూర్తితో ఏక్తా యాత్రను విజయవంతం చేద్దామన్నారు. మే 12న సాయంత్రం 4 గంటలకు వైశ్యా భవన్ నుంచి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభం అవుతుందనిఇ, ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ప్రతి వార్డులో, డివిజన్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డి శంకర్, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఓదెలు పాల్గొన్నారు.