Karimnagar:నారాయణపూర్ రిజర్వాయర్కు ఎల్లంపల్లి జలాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:33 PM
గంగాధర, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు నారాయణపూర్ రిజర్వాయర్లోకి శనివారం చేరాయి.
- డెలివరి సిస్టర్న్ వద్ద పూజలు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు
గంగాధర, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు నారాయణపూర్ రిజర్వాయర్లోకి శనివారం చేరాయి. అధికారులు ఒక్క పంపును ప్రారంభించగా నీరు నారాయణపూర్ రిజర్వాయర్లోకి చేరుతున్నాయి. నిరంతరం మోటర్ నడిపిస్తే రెండు రోజుల్లో రిజర్వాయర్ నిండి కాలువకు నీరంతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు ఇప్పటికే బావుల్లో నీరు అడుగంటి పొలాలకు తడులు అందడం లేదు. కాలువకు నీరు వస్తే బావుల్లో నీరు పెరిగి ఈ యాసంగికి ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు అంటున్నారు.
- అన్నదాతలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నియోజకవర్గ అన్నదాతలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం నారాయణపూర్ డెలివరి సిస్టర్న్ వద్ద సర్పంచ్లు, రైతులో కలిసి ఆయన పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు అడగకుముందే వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నారాయణపూర్ రిజర్వాయర్కు ముందస్తుగా నీరు విడుదల చేయించామన్నారు. గత ప్రభుత్వంలో పంటలు ఎండిపోతే నీరు విడుదల చేయాలని కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే అర్థరాత్రి అక్రమ అరెస్టులు చేసి కేసును నమోదు చేయించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జనవరిలోనే పంటలకు సాగునీరు విడుదల చేయించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు వెలిచాల తిరుమల్రావు, సర్పంచ్లు శ్రీనివాస్, వేముల భాస్కర్, రేండ్ల శ్రీనివాస్, బారాజు ప్రభాకర్రెడ్డి, బాసవేని శ్రీనివాస్, బీర్ల ఆనందం, తిరుపతి పాల్గొన్నారు.