Karimnagar: క్రీడలతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు...
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:04 AM
కరీంనగర్ క్రైం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక ఒత్తిడిని అదిగమించవచ్చని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు.
కరీంనగర్ క్రైం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక ఒత్తిడిని అదిగమించవచ్చని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ‘శౌర్య’ ఇండోర్ గేమ్స్ హాల్ను సీపీ బుధవారం ప్రారంభించారు. కమిషనరేట్లోని అస్త్ర కన్వెన్షన్ హాలు పక్కన గతంలో వాడుకలో లేక నిరుపయోగంగా ఉన్న పాత యూనిట్ హాస్పిటల్ భవనాన్ని సీపీ ప్రత్యేక చొరవతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. దీనికి ‘శౌర్య ఇండోర్ గేమ్స్ హాల్’ అని నామకరణం చేసి, సిబ్బందికి అన్ని రకాల క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా పునర్నిర్మించారు. ఈ క్రీడా వేదికలో అధికారులు, సిబ్బంది కోసం టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, క్యారం బోర్డ్స్, మసాజ్ చైర్ (విశ్రాంతి కోసం), టీవీ హాల్ వంటి వసతులను కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ ఇండోర్ గేమ్స్ హాల్ హోంగార్డు స్థాయి నుంచి కమిషనర్ వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. నిరంతరం విధులతో బిజీగా ఉండే పోలీసులు తమ మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా వారు మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించగలరని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో టైన్రీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు పాల్గొన్నారు.