Karimnagar: రేపటి నుంచి ఒంటి పూట బడులు
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:53 PM
కరీంనగర్ టౌన్, మార్చి 14: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రతియేడు మాదిరిగానే ఈసారి ఎండలు మండిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
- ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
- ‘పది’ పరీక్షా కేంద్రాల్లో 1 నుంచి సాయంత్రం 5 వరకు
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
కరీంనగర్ టౌన్, మార్చి 14: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రతియేడు మాదిరిగానే ఈసారి ఎండలు మండిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం వేళల్లో మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం అందించాలని సూచించింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయం త్రం 5 గంటల వరకు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం చివరిరోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తారు.