Karimnagar: అధికారుల కోసం పడిగాపులు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:53 PM
తిమ్మాపూర్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెల 31వరకు కొనసాగనున్నాయి.
- జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అధికారులు బిజీ
- ఇబ్బందిపడ్డ వాహనదారులు
తిమ్మాపూర్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెల 31వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ రోజు రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోని అధికారులు శుక్రవారం కరీంనగర్కు, రేణికుంట టోల్గేట్ వద్దకు వెళ్లారు. దీంతో జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చిన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అధికారులు లేక పనులు కాలేదు. కార్యాలయానికి ఉదయమే వచ్చిన వాహనదారులు కౌంటర్ల వద్ద తమ పనులు పూర్తి చేసుకొని వాహనాల తనిఖీ, డ్రైవింగ్ టెస్ట్లు, డ్రైవింగ్ లైసెన్సుల కొసం అధికారుల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రవాణా శాఖ కానిస్టేబుల్ 30 కొత్త వాహనాలకు సంబందించిన పత్రాలు తీసుకున్నాడు. డ్రైవింగ్ టెస్ట్, వాహనాల ఫిట్నెస్, టాక్సీ ప్లేట్ రిజిస్ట్రేషన్ కొనం వచ్చిన వారు అధికారుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. కార్యాలయ ఆవరణలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో చెట్ల కింద, బండ రాళ్లపై కూర్చొని అధికారుల కోసం ఎదురు చూశారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత సంబందిత అధికారులు ఒకొక్కరుగా కార్యాలయానికి రావడంతో పనులు పూర్తయ్యాయి.