Share News

Karimnagar: అమలు కాని పేపర్‌ లెస్‌ విధానం

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:57 PM

జమ్మికుంట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేపర్‌లెస్‌ విధానాన్ని అమలు చేస్తూ డిజిటల్‌ డాక్యూమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Karimnagar:  అమలు కాని పేపర్‌ లెస్‌ విధానం

- జమ్మికుంటలో ఇబ్బంది పడుతున్న దరఖాస్తుదారులు

జమ్మికుంట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేపర్‌లెస్‌ విధానాన్ని అమలు చేస్తూ డిజిటల్‌ డాక్యూమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. జమ్మికుంటలో మాత్రం ఫిజికల్‌ కాపీలు కావాల్సిందేనని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. మీ సేవా కేంద్రాల ద్వారా ఆదాయ, కుల, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తుదారుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఆ ఎస్‌ఎంఎస్‌లో ఉండే లింక్‌ ద్వారా దరఖాస్తుదారులు తమకు అవసరమైన డాక్యుమెంట్లను, రశీదులను తమ స్మార్ట్‌ ఫోన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని జూన్‌ 19న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఉంటనే అప్రూవల్‌

జమ్మికుంట మండలంలోని మీ సేవ సెంటర్లలో కులం, ఆదాయం, నివాసం, ఇతర ధువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలు ఫిజికల్‌ డాక్యుమెంట్లు లేకుండా తహాశీల్ధార్‌ కార్యాలయంకు వెళ్తే అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఫిజికల్‌ డాక్యుమెంట్లు లేకపోతే అప్రూవల్‌ కావని చెబుతున్నారు. మీసేవ సెంటర్ల నిర్వాహకులు మాత్రం దరఖాస్తుదారులకు డాక్యుమెంట్లు అవసరం లేవని చెప్పి తహసీల్దార్‌ కార్యాలయానిక పంపిస్తున్నారు. అధికారులు అవేమి తమకు తెలియదని డాక్యుమెంట్లు ఉంటనే పని అవుతుందని చెబుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పేపర్‌లెస్‌ విధానం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 11:57 PM