Karimnagar: ప్రశాంతంగా ఎప్సెట్
ABN , Publish Date - May 04 , 2026 | 11:58 PM
తిమ్మాపూర్, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎప్సెట్-2026 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలు
- 4700 మంది విద్యార్థులకు 4432 మంది హాజరు
తిమ్మాపూర్, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎప్సెట్-2026 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి సెషన్లో 2,350 మంది విద్యార్థులకు 2,208 మంది (94ు) హాజరయ్యారు. రెండో సెషన్లో 2,300 మంది విద్యార్థులకు 2,224 మంది (94.6ు) హాజరయ్యారు. మొత్తంగా 4700 మంది విద్యార్థులకు 4432 మంది హాజరైనట్లు ఎప్సెట్ కన్వీనర్ డాక్టర్ కె.విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కంప్యూటర్ స్ర్కీన్పైనే మార్కులు
ఈసారి నుంచి పరీక్ష పూర్తి కాగానే విద్యార్థులు తమ మార్కులు తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్ స్ర్కీన్ పైనే ప్రాథమిక మార్కులు కనిపిస్తాయి. తుది ర్యాంకులను మాత్రం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయిస్తారు.
నేడు ఒకే సెషన్లో..
మంగళవారం ఒకే సెషన్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పరీక్ష ఉంటుంది. తిరిగి ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశాల కోసం మే 9,10,11వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.