Karimnagar: అరకొరగా బస్సులు..
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:31 AM
భగత్నగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు చేపడుతున్న సమ్మె రెండో రోజు సక్సెస్ అయ్యింది. బస్సులు అప్పడొకటి.. ఇప్పుడొకటి నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
- ఇబ్బందుల్లో ప్రయాణికులు
- ఆర్టీసీ సమ్మె రెండో రోజు సక్సెస్
భగత్నగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు చేపడుతున్న సమ్మె రెండో రోజు సక్సెస్ అయ్యింది. బస్సులు అప్పడొకటి.. ఇప్పుడొకటి నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా డిపోల ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కరీంనగర్ డిపో ఎదుట కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా ప్రైవేట్ హైర్ బస్సులతో పాటు, జెబిఎం ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడిచాయి. ఆర్టీసీలోని సంఘాలన్ని సమ్మెకు మద్ధతు తెలపడంతో రెండో రోజు సమ్మె సక్సెస్ అయ్యింది. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా 550 బస్సులు (65 శాతం) బస్సులను నడిపించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు డిమాండ్ చేశారు. గురువారం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఫ ప్రైవేట్ వాహనాల జోరు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి. కరీంనగర్ నుండి అన్ని రూట్లలో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తున్నారు. కార్లు, టాటా ఏసీ వాహనాలు, ఆటోలు, జీపులు తదితర వాహనాల్లో ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించారు. ప్రైవేట్ వాహనాల్లో ఛార్జీలను సైతం కొంత మేర పెంచి వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.