Karimnagar: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - May 01 , 2026 | 12:10 AM
చిగురుమామిడి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అధికారులను హెచ్చరించారు.
- తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్
చిగురుమామిడి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అధికారులను హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కొత్తపల్లి - హుస్నాబాద్ ఫోర్లైన్ రోడ్డు పనుల్లో భాగంగా పైపులైన్లను ఎందుకు షిప్టు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని వారికి నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, జడ్పీ సీఈవో మొగిళి శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో టి విజయ్కుమార్, రూరల్ ఏసీపీ విజయ్కుమార్ పాల్గొన్నారు.
ఫ పంట మార్పిడి పాటించండి..
రైతులు పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరం మేరకే రసాయన మందులు ఉపయోగించాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు.