jagitiala : అంతుచిక్కని ఓటరు నాడి
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:32 AM
జగిత్యాల, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ ఓటర్ల నాడి అంతుచిక్కక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.
- తాజా పరిస్థితులపై ప్రధాన పార్టీల ఆరా
- తటస్థ ఓటర్లపై దృష్టి
- పోలింగ్కు మిగిలింది మూడు రోజులే
జగిత్యాల, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ ఓటర్ల నాడి అంతుచిక్కక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఒకవైపు ఓటర్ల నాడిని పసిగట్టడానికి ప్రయత్నిస్తూ మరోవైపు ప్రచార అస్త్రాలకు పదును పెడుతున్నాయి.
ఫ వలస ఓటర్లకు గాలం..
తటస్థ, వలస ఓటర్లకు గాలం వేసేందుకు ఎత్తులకు పైఎత్తు వేస్తున్నారు. పట్టణాల్లోని ఇతర వార్డులు, కాలనీలతో పాటు తదితర ప్రాంతాలకు పలు కారణాలు, బతుకుదెరువు కోసం వెళ్లిన కుటుంబాలను కలుస్తూ...ఓటింగ్ రోజు స్వవార్డులకు వచ్చేలా ప్రణాళిక చేస్తున్నారు. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు సుమారు 200 నుంచి 250 మంది వరకు ఇతర ప్రాంతాలకుఓటర్లు బతుకు దెరువు కోసం ఇతర వార్డులకు వలస వెళ్లారన్న అంచనా ఉంది. జిల్లాలోని పలు పట్టణాలకు చెందిన పలువురు ఓటర్లు మహారాష్ట్రలోని ముంబాయి, బీవండి, పుణే, హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భవన నిర్మాణ రంగం, బార్, రెస్టారెంట్, రోజువారి కూలీ, అవుట్ సోర్సింగ్, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. పలువురు యువతీ యువకులు ఉన్నత విద్య, ఉద్యోగ అవసరాల నిమిత్తం హైద్రాబాద్, సికింద్రాబాద్, ముంబాయి, బెంగుళూరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఓట్ల సమయంలో స్వంత పట్టణాలకు వస్తారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
ఫ పోటాపోటీ ప్రచారం
ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో అధికార కాంగ్రెస్ బరిలో నిలువగా, ప్రత్యేక రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పథకం అందించామని బీఆర్ఎస్...తెలంగాణలో జరిగిన ప్రతీ పనిలో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, యువకులు, కుల సంఘాల ఓట్లు కీలకంగా మారనున్నాయి. గెలుపులో ప్రతీ ఓటు కీలకంగా మారనున్న నేపథ్యంలో పార్టీలు ఒక్కరిని కూడా వదలడం లేదు. పార్టీలకు అతీతంగా ఉన్న ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అనుకూలంగా ఉన్న వారితో సంప్రదింపులు జరుపుతూ ఓటింగ్ శాతం పెంచుకునేలా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.
ఫజన సమీకరణలో పైచేయి సాధించేలా...
జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో పైచేయి సాధించే విధంగా జనసమీకరణ చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధినాయకత్వం, ముఖ్యనేతలను రంగంలోకి దింపుతూ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు, చిన్నా చితక పార్టీలు సైతం ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. వార్డు, పోలింగ్ బూత్ స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రచారంలో ఎక్కువ మంది కార్యకర్తలు, జనం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఫగంప గుత్త ఓట్లపై నజర్
మున్సిపల్ కౌన్సిలర్ తరపున పార్టీలోని ముఖ్యులు పట్టణాల వారీగా పలు సామాజిక వర్గాలకు చెందిన ఓట్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రధాన వ్యక్తుల వద్దకు వెళ్లి తమ పార్టీకి ఓట్లు పడేలా చూడాలంటూ విజ్ఙప్తి చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఏ పార్టీ కూడా వదిలి పట్టడం లేదు. ముఖ్యంగా వలస ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. వలస కుటుంబాలకు వాట్సప్ కాల్లో టచ్లో ఉంటూ....ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రతీ ఓటర్ను కౌన్సిలర్ అభ్యర్థుల వాయిస్తో రికార్డు చేసిన ఫోన్ కాల్ చేస్తూ....ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ ఆయా పార్టీల సర్వే
క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. ప్రత్యేక సర్వే టీంలను ఏర్పాటు చేసి ఏ రోజుకు ఆ రోజు నివేదికలను తెప్పించుకుంటున్నాయి. నేరుగా ఓటర్ల సెల్ఫోన్లకు కాల్ చేసి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాల్లో పెడుతున్న పోస్టులను బట్టి సదరు ఓటరు, సదరు సామాజిక వర్గం, సదరు ప్రాంతం ఎటువైపు మొగ్గు చూపుతున్నాయో అంచనా వేస్తున్నారు.