నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 13 , 2026 | 12:20 AM
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ టౌన్, మే 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు 14,452 మంది హాజరుకానున్నారు. 10,314 మంది ఫస్ట్ ఇయర్, 4,138 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలు రాయనున్నారు.
ఫ 33 పరీక్షా కేంద్రాలు
జిల్లా కేంద్రంలో 20, ఇతర ప్రాంతాల్లో 13 మొత్తం 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక డిపార్టుమెంటల్ అధికారి, ఒక చీఫ్ సూపరింటెండెంట్ను నియమించారు. పరీక్షలు డీఐఈవో వి ఆంజనేయరావు కన్వీనర్గా మరో ఇద్దరు సభ్యులతో డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు సిట్టింగ్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా సమయానికి గంట ముందు నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్స్ వస్తువులను అనుమతించరు.
ఫ సమన్వయ కమిటీ సమావేశం
అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాఖడే ఇటీవల బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులతోపాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్సు సెంటర్లను పరీక్షలు పూర్తయ్యే వరకు మూసివేయాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ పరీక్షా సమయంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ప్రాథమిక చికిత్సకు సిబ్బందిని అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్,ఫ్యాన్లు, లైటింగ్, మంచినీటి వసతి కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఫ ఆన్లైన్ హాల్టికెట్లతో పరీక్షలు రాయవచ్చు
- డీఐఈవో, కన్వీనర్ వి.ఆంజనేయరావు
ఇప్పటికే అన్ని కళాశాలల్లో విద్యార్థులకు హాల్టికెట్లను జారీ చేశారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని తెలిసిది. అలాంటి వారు నేరుగా మీసేవలో ఆన్లైన్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు రాయవచ్చు. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ కానీ గెజిటెడ్ అధికారుల సంతకం కానీ అవసరం లేదు.