ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - May 08 , 2026 | 11:57 PM
జిల్లాలో ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగే బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే అధికారులకు సూచించారు.
కరీంనగర్ టౌన్, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగే బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో సప్లమెంటరీ పరీక్షలకు మొత్తం 14,452 మంది విద్యార్థులు హాజరువుతున్నందున 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని, ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసు భద్రత కల్పించాలని, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ప్రాథమిక చికిత్సకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్,ఫ్యాన్లు, లైటింగ్, మంచినీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐఈవో వి.ఆంజనేయరావుతోపాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.